Jude Anthony Joseph | మలయాళ చిత్రం ‘2018’ దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘2018’ చిత్రం ఆస్కార్కు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీకాంత్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జోసెఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2018 సినిమా గొప్ప చిత్రమని, ఎలా చిత్రాన్ని షూట్ చేశారని తలైవా అడిగారని పేర్కొన్నారు.
ఆస్కార్ బరిలో నిలిచిన సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నానని, తన ఆశీస్సులు మీ వెంటే ఉంటాయని రజనీకాంత్ చెప్పినట్లుగా దర్శకుడు తెలిపారు. అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు తాను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. ఈ అవకాశం దొరికేలా సహకారం అందించిన తన స్నేహితురాలు సౌందర్యకు సైతం ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి ఈ సారి మలయాళ చిత్రం ‘2018’ అధికారికంగా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేయనున్న ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘2018’ చిత్రాన్ని ఎంపిక చేశారు.
ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ.. ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 22 చిత్రాలను వీక్షించిన అనంతరం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం ‘2018’ సినిమాని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో ‘2018 అందరూ హీరోలే’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200కోట్లకుపైగా బిజినెస్ చేసి.. మలయాళ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలకు 96వ ఆస్కార్ అవార్డులను మార్చి 10, 2024న లాస్ ఏంజిల్స్లో జరుగనున్న కార్యక్రమంలో అందజేయనున్నారు.