సముద్ర గర్భంలోని టైటానిక్ ఓడ శకలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. సముద్రం అడుగున జలాంతర్గామి పేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్గార్డ్ వెల్లడించింది. తాజాగా ఈ ప్రమాదంపై ‘టైటానిక్’ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. ‘టైటానిక్’ మునిగిపోయిన ప్రాంతాన్ని ఆయన ఇప్పటికే 33 సార్లు సందర్శించారు. సముద్ర గర్భంలో ప్రయాణం చేయడం అత్యంత సాహసభరిత కృత్యమని, అందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కామెరూన్ అన్నారు.
టైటానిక్ ఓడ మునిగిపోయిన చోటే ఈ ప్రమాదం జరగడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ‘ఇప్పటికే నేను ఆ ప్రాంతానికి 33 సార్లు వెళ్లి వచ్చాను. అక్కడ నాకు కూడా కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ప్రాంతంలో దాదాపు 3500 మీటర్ల లోతు ఉంటుంది. దానివల్ల జలాంతర్గామిపై విపరీతమైన పీడనం ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆచూకీ కూడా మిగలదు. టైటానిక్ మునిగిన ప్రాంతంలో ఏదో తెలియని శక్తి ఉంది. పేలిపోయిన సబ్మెరైన్కు అధునాతన సెన్సార్స్ ఉన్నాయి. అందులోని వ్యక్తులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఉంటారు. వారికి బయటపటే మార్గాలు కూడా ఉన్నాయి. అయితే అనూహ్యంగా సబ్మెరైన్ పేలిపోవడంతో వారంతా చనిపోయారు’ అని జేమ్స్ కామెరూన్ చెప్పారు.