Manjummel Boys | మలయాళ ఇండస్ట్రీలో 200కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది ‘మంజుమ్మల్ బాయ్స్’. యథార్థ సంఘటనల ఆధారంగా సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ మాట్లాడుతూ ‘కొడైకెనాల్లోని గుణ గుహ నేపథ్యంలో నడిచే కథ ఇది.
కేరళ మంజుమ్మెల్ పట్టణానికి చెందిన కొందరు స్నేహితులు గుణ కేవ్స్కు వెళతారు. వారిలో ఓ వ్యక్తి గుణ గుహలో చిక్కుకుపోతాడు. అతన్ని రక్షించడానికి మిత్రబృందం చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథ ఆద్యంతం ఆసక్తిగా నడుస్తుంది. ఈ సినిమా కోసం రియల్ మంజుమ్మెల్ బాయ్స్ను కలిసి వివరాల్ని సేకరించాను.
ఈ సినిమా తీయడానికి మూడేళ్ల సమయం పట్టింది. చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూటింగ్ జరిపాం. ‘గుణ’ చిత్రంలోని ‘కమ్మని నీ ప్రేమలేఖలే రాసింది హృదయమే..’ పాటను ఆ గుహలోనే చిత్రీకరించారు. అందుకే సినిమా ఆరంభంలో ఈ పాటను ఉపయోగించాం. కమల్హాసన్ ఈ సినిమా చూసి మంచి ప్రయత్నం చేశారని మమ్మల్ని అభినందించారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది’ అన్నారు.