‘బోయపాటితో మూడు సినిమాలు చేశాను. మూడూ హిట్లే. ఇది నాలుగో సినిమా. శివశక్తే మమ్మల్ని ప్రేరేపించి ఈ సినిమా చేయించింది. సనాతనధర్మ పరాక్రమం ఏంటో చూపించే సినిమా ఇది. దేశాన్ని కాపాడేవాళ్లు సైనికులైతే, ధర్మాన్ని కాపాడేవాళ్లు అఘోరాలు, యోగులు. ఈ విషయాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు బోయపాటి. ధర్మానికి అపచారం జరిగితే దైవం సహించడని చెప్పే సినిమా ఇది. ఇదొక మహాయజ్ఞం. బోయపాటితో నేను చేసిన ప్రతి సినిమా అలాగే సాగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా విషయంలో మనం ఇంకా ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం.’ అని నందమూరి బాలకృష్ణ నమ్మకంగా చెప్పారు. ఆయన హీరోగా రూపొందిన పానిండియా డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ : తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్గా రానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘సెన్సార్ పూర్తయింది.
యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దర్శకునిగా నా గౌరవం పెరుగుతుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. చాలా ఆనందం అనిపించింది. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ‘అఖండ’ జనాల్లోకి చొచ్చుకుపోయింది. ‘అఖండ 2’ అంతకు మించి ఉండాలని ముందే అనుకున్నాం. చేశాక చూసుకుంటే భగవంతుడే మాతో ఈ సినిమా చేయించాడనిపించింది. ధర్మానికి ద్రోహం జరిగితే.. మృత్యుంజయుడైన దేవుడే మృత్యువై మీదపడతాడు.. అతడే ‘అఖండ’. డిసెంబర్ 5 రాబోతున్నాం. విజయం తథ్యం’ అని చెప్పారు. ‘అరుణాచలం వెళ్లాలంటే చాలా అదృష్టం ఉండాలి. ‘అఖండ 2’ లాంటి సినిమా చేయాలంటే చాలా బలం ఉండాలి.’ అని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. ఇంకా సీనియర్ నటులు మురళీమోహన్, మహేంద్రన్, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, పూర్ణ, తదితరులు కూడా మాట్లాడారు.