సంతోష్ శోభన్, ప్రియ భవానీశంకర్ జంటగా నటిస్తున్న సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. పెండ్లి నేపథ్యంగా సాగే కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న తెరపైకి రాబోతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల. ఆయన మాట్లాడుతూ…‘తొలి చిత్రమే ఇలాంటి పెద్ద సంస్థలో రూపొందించడం సంతోషంగా ఉంది. శివ, శృతి అనే జంట మధ్య సాగే కథ ఇది. కొత్తగా పళ్లైన వీరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. భర్తకు ఉద్యోగం లేకుంటే భార్య సమాజంలో, కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది ప్రధానంగా చూపించాం. అమ్మాయిలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయనేది తెరకెక్కించాం. వివాహం తర్వాత ఈ జంట నేర్చుకున్న జీవిత పాఠాలు ప్రతి ప్రేక్షకుడు రిలేట్ అయ్యేలా ఉంటాయి. సెన్సార్ బృందం క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. సకుటుంబంగా చూసే చిత్రమిదని వారు ప్రశంసించారు. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మా చిత్ర కథపై నమ్మకం ఉంది. అందుకే పండుగకు విడుదల చేస్తున్నాం’ అన్నారు.