‘ప్రేమకు హద్దులు ఉండవని చాటిచెప్పే చిత్రమిది. ఇద్దరు ప్రేమికుల జీవితాలతో ముడిపడి ఆసక్తికరంగా సాగుతుంది’ అని అన్నారు అజయ్భూపతి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. రేపు విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో అజయ్భూపతి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఇద్దరు హీరోలున్న సినిమా చేయడం కష్టమే. కానీ అందులో చక్కటి కిక్ ఉంటుంది. దళపతి, విక్రమ్వేదా లాంటి చిత్రాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్ తర్వాత ఇద్దరు హీరోలతో కూడిన కథతో సినిమా చేయాలని బలంగా నిర్ణయించుకున్నా. ఒకరిని స్నేహితుడిగా స్వీకరిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగించాలి. స్నేహితులు చేసే ఒప్పులను మాత్రమే కాదు తప్పుల్ని అంగీకరించాలనే పాయింట్తో రూపొందించాను. వైజాగ్ సముద్రతీరం బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. శర్వానంద్, సిద్ధార్థ్ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఉంటాయి. తెరపై వారి ఇమేజ్లు కాకుండా పాత్రలే కనిపిస్తాయి. మాస్ కోణంలో సిద్ధార్థ్ పాత్ర సాగుతుంది. శర్వా క్యారెక్టర్తో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. నాయకానాయికలతో పాటు ప్రతి పాత్రకు ప్రారంభం, ముగింపు ఉంటాయి. నిత్యజీవితంలో నేను చూసిన, పరిచయమున్న వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలోని పాత్రల్ని సృష్టించాను.
సమంతను అనుకున్నాం
హీరోయిన్ పాత్రల్ని బలంగా రాసుకున్నప్పుడే కథలోని ఎమోషన్స్, డ్రామా బాగా పండుతాయని నేను నమ్ముతాను. బాలచందర్ సినిమాలంటే నాకు ఇష్టం. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యమిస్తూ ఆయన చేసిన ‘అంతులేనికథ’తో పాటు చాలా సినిమాలునాపై ప్రభావాన్ని చూపించాయి. ఆయన శైలిలోనే నేను హీరోయిన్ క్యారెక్టర్స్ను అలంకార ప్రాయంగా కాకుండా శక్తివంతంగా రాస్తుంటాను. మహా అనే అమ్మాయి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ క్యారెక్టర్ కోసం తొలుత సమంతను తీసుకోవాలని అనుకున్నాం. కానీ కుదరలేదు.
టాలీవుడ్ను వదిలిపెట్టను
‘ఆర్ఎక్స్ 100’ సినిమా హిందీతో పాటు అన్ని భాషల్లో రీమేక్ అవుతున్నది. హిందీ రీమేక్కు నిర్దేశక బాధ్యతల్ని చేపట్టమని నిర్మాతలు అడిగారు. ప్రస్తుతం భారతీయ చిత్రసీమకు టాలీవుడ్ తలమానికంగా మారింది. ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టి తెలియని భాషలో సినిమా చేయడం అర్థరహితమనే ఆలోచనతో ఆ అవకాశాన్ని వదులుకున్నా. మాస్ ఎంటర్టైనర్ కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా. ఓటీటీ కోసం ఓ ఆంథాలజీ సినిమా చేస్తున్నా.