‘నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్ ప్రారంభించాం. తొలి చిత్రంగా ‘బలగం’ రూపొందించాం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. డీఆర్పీ (దిల్రాజు ప్రొడక్షన్స్) పతాకంపై హర్షిత్, హన్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కల్యాణ్రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా నటుడు వేణు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం డీఆర్పీ బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘నిర్మాతలుగా హర్షిత్, హన్షితలకు ఈ సినిమా శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం ఉంది. ‘బొమ్మరిల్లు’ ‘శతమానం భవతి’ చిత్రాలు మా సంస్థకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి పేరు తీసుకొచ్చాయి. ‘బలగం’ సినిమా అదే తరహాలో మెప్పిస్తుంది’ అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘ తెలంగాణ నేపథ్య కథ ఇది. సిరిసిల్లలో షూటింగ్ చేశాం. వినోదంతో పాటు భావోద్వేగాల్ని పంచుతుంది’ అని తెలిపారు. దర్శకుడిగా వేణు ప్రతిభను ఆవిష్కరించే చిత్రమిదని ప్రియదర్శి చెప్పారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త కంటెంట్ను అందించాలనే లక్ష్యంతో ఈ బ్యానర్ను ఆరంభించామని నిర్మాత హన్షిత రెడ్డి తెలిపారు.