సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై టాలీవుడ్కి సంబంధించిన పలువురు ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆన్లైన్ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయ్యింది. మచిలీపట్నంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి నిర్మాత దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజాగా సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ రంగానికి సంబంధించిన సమస్యలు, ఆన్లైన్ టికెట్ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై దిల్రాజు స్పందిస్తూ.. ‘ప్రభుత్వం మా నుంచి కొంత సమాచారం అడిగింది. ఆ సమాచారం ఇవ్వడానికే మంత్రిని కలిశాము’ అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. సమావేశంలో దిల్ రాజు, అలంకార్ ప్రసాద్.. ఇతర నిర్మాతలు పాల్గొన్నారు.
రీసెంట్గా ఏపీ సీఎం జగన్తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో కలిసి మధ్యాహ్నాభోజనం కూడా చేశారు.