Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు థియేటర్లలో ఈ చిత్రం దూసుకుపోతుండగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి ఒక భారీ డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 285 కోట్లు చెల్లించినట్లు టాక్ నడుస్తోంది. ఇది ‘పుష్ప 2’ ఓటీటీ డీల్ (దాదాపు రూ. 275 కోట్లు) కంటే ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత, అంటే 2026 జనవరి 30న లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండటంతో, ఈ డీల్ రెండు భాగాలకు కలిపి జరిగిందా లేక మొదటి భాగానికే ఇంత భారీ మొత్తం ఇచ్చారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి రూ. 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రణవీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ‘ధురంధర్: రివెంజ్’ పేరుతో పార్ట్ 2 వచ్చే ఏడాది మార్చి 19, 2026న విడుదల కానుంది.