ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 75 శాతం ఊపిరితిత్తులు ఇన్ ఫెక్షన్కు గురయ్యాయని తెలుస్తోంది. అయితే హాస్పిటల్ ఖర్చులు రోజుకు లక్షలు అవుతున్నాయని, దాతలు సాయం చేయాల్సిందిగా శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలోనే హీరో ధనుష్, రియల్ హీరో సోనూ సూద్ స్పందించారు.
అందరి కన్నా ముందు స్పందించిన సోనూసూద్ ..శివశంకర్ ఫ్యామిలీతో మాట్లాడాను, ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు. ఇక ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్కు అండగా ఉంటానని అన్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కూడా చేశారు. ఆయనతో పాటు కుటుంబం కూడా కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే శివశంకర్ మాస్టర్ సతీమణి, పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకింది. పెద్ద కుమారుడికి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉండగా, మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు.