Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి లీగల్ వివాదంలో చిక్కుకున్నారు. స్క్రిప్ట్ పూర్తి చేయకపోవడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైందని ఆరోపిస్తూ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది. తమకు జరిగిన నష్టానికి గాను రూ.20 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వివాదం మూలాలు 2016 సంవత్సరానికి చెందినవి. ఆ సమయంలో తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్పై నాన్ రుద్రన్ అనే సినిమా చేయడానికి ధనుష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో పూర్తి చేయాలని అప్పట్లో ప్లాన్ చేశారు. అయితే మధ్యలో దర్శకుడు మారడం, స్క్రిప్ట్ పూర్తిగా అందించకపోవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది.
షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, దాదాపు రూ.20 కోట్ల వరకు నష్టపోయామని నిర్మాతలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి ధనుష్ ఇతర సినిమాల్లో బిజీ అవుతున్నారని కూడా నోటీసుల్లో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ధనుష్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా ధనుష్ ప్రస్తుతం తన 55వ చిత్రంగా తెరకెక్కుతున్న D55 ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.
ఈ చిత్రంలో ధనుష్ సరసన శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ మరియు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రానుందని చిత్ర యూనిట్ సంకేతాలు ఇస్తోంది. మొత్తంగా ఒకవైపు లీగల్ వివాదం, మరోవైపు భారీ ప్రాజెక్ట్తో ధనుష్ కెరీర్ ప్రస్తుతం రెండు దారుల్లో సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ‘నాన్ రుద్రన్’ వివాదంపై ఆయన స్పందన ఎలా ఉంటుందో అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.