Adipurush Movie | గత వారం రోజుల నుండి ‘ఆదిపురుష్’ సినిమా టీజర్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దసరా కానుకగా విడుదలైన ఈ టీజర్పై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడు, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారని తెలిపాడు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్కు, ఆదిపురుష్ చిత్ర యూనిట్కు నోటీసులు జారీ చేసింది.
దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రామయణం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను రూపొందించాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.