ప్రతి ఒక్కరి జీవితంలో దుర్దశ ఉంటుందని, అయితే దాని నుంచి బయటపడేందుకు కుటుంబం, సన్నిహితుల తోడ్పాటు ఎంతో అవసరమని చెప్పింది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. ఏడేళ్ల క్రితం తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురైన ఆమె కౌన్సిలింగ్ ద్వారా కోలుకుంది. తన జీవితంలో ఆ రోజులు సంఘర్షణతో సాగాయని దీపికాపడుకోన్ గుర్తుచేసుకుంది. ఓ సోషల్మీడియా వేదికలో అభిమానులతో ముచ్చటించిన ఆమె నాటి పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. ‘2014లో నేను తీవ్రమైన డిప్రెషన్తో సతమతమయ్యాను. కెరీర్లో మంచి విజయాలు సాధించినప్పటికీ ఏదో వెలితిగా అనిపించేది. జీవితమంతా శూన్యం ఆవహించిందనే భావనలో ఉండేదాన్ని. బ్రతకడంలో అర్థం, ఆశయం ఏమీ లేవనే ఆలోచనలు పదేపదే భయపెట్టేవి. అలా కొన్ని నెలలు గడచిపోయాయి. ఆ సమయంలో నాతో కొన్ని రోజులు గడపడానికి అమ్మనాన్న ముంబయి వచ్చారు. వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక్కసారిగా మా అమ్మ ముందు బోరున ఏడ్చేశాను.
అప్పుడే నాలోని మానసిక వ్యాధిని అమ్మ గుర్తుపట్టింది. తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని నాతోనే ఉండిపోయింది. అనంతరం వరుసగా కౌన్సిలింగ్ సెషన్స్కు హాజరవుతూ కుంగుబాటును దూరం చేసుకున్నా’ అని దీపికాపడుకోన్ చెప్పింది. ఇప్పటికీ ప్రతిరోజు తన మానసిక స్థితిగతులపై సమీక్షించుకుంటానని, ఏదైనా సమస్యగా అనిపిస్తే కుటుంబ సభ్యులతో చర్చిస్తానని తెలిపింది. ఏ రంగంలో ఉన్న మహిళలైనా సరే…కెరీర్లో జయాపజయాలతో సంబంధం లేకుండా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని దీపికాపడుకోన్ సూచించింది.