డిమాండ్లు ఎక్కువ కావడంతో, చేస్తున్న సినిమాల నుంచి తొలగించబడి, ఉన్న డిమాండ్ కోల్పోయిందంటూ కొన్ని సోషల్ మీడియా వేదికలు దీపిక పదుకొణేపై వార్తలు రాశాయి. అయితే.. తాజాగా వినిపిస్తున్న ఓ బీటౌన్ వార్త.. దీపిక డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదని, ఇంకా మాట్లాడితే, మరింత పెరిగిందని చెబుతున్నది.
వివరాల్లోకెళ్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పానిండియా చిత్రం ‘రాకా’లో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు గాను ఏకంగా 25కోట్ల పారితోషికాన్ని దీపిక పదుకొణే అందుకుంటున్నదట. ఇదే ఆ వార్త సారాంశం.
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంత పారితోషికం తీసుకున్న హీరోయిన్ మరొకరు లేరు. ఈ వార్త వాస్తవమైతే.. నిజంగా ఇది రికార్డే. అంతేకాదు, దీపికకు డిమాండ్ తగ్గిందని వార్తలు రాసిన వాళ్లకు ఈ వార్త ఓ చెంపపెట్టు. అల్లు అర్జున్, అట్లీ కూడా ఈ సినిమా కోసం భారీ పారితోషికాలనే తీసుకుంటున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా చిత్రం 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.