బుల్లితెర ప్రేక్షకులని కొన్ని దశాబ్ధాలుగా అలరిస్తున్న బిగ్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి. అమితాబ్ బచ్చన్ హోస్ట్గా రూపొందిన ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇటీవల ఈ షోకి గంగూలీ,సెహ్వాగ్ జంటగా హాజరు కాగా వారు పలు విషయాలు వెల్లడిస్తూ సందడి చేశారు.ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, న్యత్య దర్శకురాలు ఫరా ఖాన్ సందడి చేశారు.
గణేష్ చతుర్థి సందర్భంగా (శుక్రవారం, సెప్టెంబరు 10) ప్రసారం కానున్న ఎపిసోడ్కి దీపికా, ఫరా ఖాన్ హాజరు కాగా, ఇద్దరు తెగ సందడి చేశారు. రీసెంట్గా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఇందులో దీపికా తన భర్త రణ్వీర్ సింగ్పై అమితాబ్కు ఫిర్యాదు చేయడం మనం గమనించవచ్చు. నాభర్త వంట చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఇంత వరకు చేయలేదు అంటూ దీపికా అమితాబ్కి ఫిర్యాదు చేసింది.
దీంతో వెంటనే అమితాబ్ రణ్వీర్కి కాల్ కలిపారు. విషయం మొత్తం విన్న రణ్వీర్.. తన ఒళ్లో కూర్చొబెట్టుకొని ఆమ్లెట్ తినిపిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. అది విన్న ఫరా ఖాన్ ‘ఆమ్లెట్ తినిపించమన్నారు.. ఒడిలో కూర్చొబెట్టుకొమనలేదు’ అంటూ సెటైర్ వేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిసాయి.
ఇక ఈ కార్యక్రమానికి మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విన్నర్ పవన్ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ కూడా హాజరయ్యారు. వారు తమ మ్యూజికల్ ట్రీట్తో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. సందడిగా సాగనున్న ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.