Thalapathy Vijay | తమిళనాట తిరుగులేని అభిమానగణం ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాల ద్వారా ఆయన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. భవిష్యత్తులో ఈ అగ్రహీరో క్రియాశీలక రాజకీయాల్లోకి కూడా రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈ నెల 17న విజయ్ చెన్నైలో సన్మానించబోతున్నారు. ఈ కార్యక్రమంతో పాటు తమిళనాడులోని వివిధ జిల్లాల్లో ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు భారీస్థాయిలో ప్రచారానికి సన్నాహాలు చేశారు. అయితే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని, ఫ్లెక్సీలు కూడా పెట్టొద్దని విజయ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ చేసే హంగామా వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతారని అభిమాన సంఘాలకు రాసిన లేఖలో విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల 22న ఫస్ట్గ్లింప్స్ విడుదలకానుంది.