Daksha The Deadly Conspiracy | మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy) తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ తొలిసారిగా ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ తండ్రీ – కూతుళ్ల కాంబినేషన్ కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే థియేటర్స్ లో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ దీపావళికి సినీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ‘దక్ష’ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు (అక్టోబర్ 17) నుంచే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం, నెల రోజుల లోపే ఓటీటీ ఆడియన్స్ కోసం అందుబాటులోకి రావడం విశేషం. వంశీ కృష్ణ మల్లా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాను ఒక థ్రిల్లింగ్ కాన్స్పిరసీ డ్రామాగా అద్భుతంగా మలచారు. గ్రాండ్గా నిర్మించబడిన ఈ చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. సినిమాలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ కాగా, మంచు లక్ష్మి పోషించిన సీఐ దక్ష పాత్ర చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. మోహన్ బాబు కీలకపాత్రలో నటించడం మరో హైలైట్. ఈ చిత్రంలో సముద్ర ఖని, సిద్ధిక్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలోని కొన్ని సీక్వెన్సెస్ ‘రా అండ్ రస్టిక్’ గా ఉంటూ గూస్ బంప్స్ తెప్పించాయని రివ్యూలు వచ్చాయి.
కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ రెండు మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. సీఐ దక్ష (మంచు లక్ష్మి) హైదరాబాద్లోని కంటైనర్ యార్డులో జరిగిన ఒక అనుమానాస్పద మరణం కేసును టేకప్ చేస్తుంది. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తి కూడా ఇదే విధంగా చనిపోతాడు. ఈ రెండు హత్యల వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని ఒక చిన్న క్లూ ఆధారంగా దక్ష ఎలా ఇన్వెస్టిగేట్ చేసి ఛేదించింది అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం.