Allu Cinemas Wall of Fame | హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం గురువారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవం తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మల్టీప్లెక్స్ లాంజ్లో భారతీయ సినిమాకు దిశానిర్దేశం చేసిన గొప్ప దర్శకుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘వాల్ ఆఫ్ ఫేమ్’ ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ గోడపై టాలీవుడ్ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో పాటు కన్నడ దర్శకులు ప్రశాంత్ నీల్, రిషభ్ శెట్టి, తమిళ దర్శకులు మణిరత్నం, అట్లీ.. తదితర దర్శకుల ఫొటోలు ఉంచారు. అయితే వీరి ఫొటోలు ఉంచారు కానీ భారతీయ సినిమా గమనాన్ని మార్చిన రామ్ గోపాల్ వర్మ (RGV), భారీ చిత్రాల సృష్టికర్త శంకర్, మరియు సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వంటి దిగ్గజాల ఫోటోలు లేకపోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం కొన్ని కమర్షియల్ హిట్లు మాత్రమే ఉన్న అట్లీని అప్పుడే లెజెండరీ జాబితాలో ఎలా చేరుస్తారని, ఆయన కంటే గొప్ప అనుభవం ఉన్న దర్శకులను ఎందుకు వదిలేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతోనే సినిమా చేస్తుండటంతో ఆయనకు అక్కడ చోటు దక్కిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బన్నీకి మాస్ ఇమేజ్ తెచ్చిన పూరి జగన్నాథ్ వంటి వారిని పక్కన పెట్టడం ఫ్యాన్స్కు రుచించడం లేదు. అయితే మరోవైపు, మల్టీప్లెక్స్లో మరోచోట కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి క్లాసిక్ దిగ్గజాల ఫోటోలు ఉన్నాయని యాజమాన్య వర్గాల సమాచారం అయినప్పటికీ, ప్రస్తుత తరం స్టార్ డైరెక్టర్ల ఎంపికలో ఆర్జీవీ, శంకర్ వంటి పేర్లు లేకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. మొత్తానికి ఈ వాల్ ఆఫ్ ఫేమ్ ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
The Wall of Legendary Indian Directors at #AlluCinemas is a true tribute to the masters who shaped Indian cinema 🎬#AlluArjun pic.twitter.com/6N3LRVkLNg
— Milagro Movies (@MilagroMovies) March 12, 2026