Superstar Krishna | సూపర్స్టార్ కృష్ణ మృతిపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ప్రకటన చేశారు. నిన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్తో సోమవారం ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, వచ్చిన కొద్ది గంటల్లో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని తెలిపారు. అప్పటికీ ఆయనకు చికిత్స ప్రారంభించామని, సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరమైందని చెప్పారు. ప్రతి గంటకు కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు.
సాయంత్రం 7 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వివరించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని, చివరి క్షణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నామన్నారు. వైద్యనీతి మేరకు.. ఏ చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యులు భావించి.. ఆయనను ఇబ్బందులకు గురి చేయకుండా, నొప్పి లేకుండా చూడాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారని గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబమంతా గత తొమ్మిదేళ్లుగా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నారని, కృష్ణకు వైద్య సేవలు అందించినందుకు గర్వపడుతున్నామని చెప్పారు.