ఇండస్ట్రీలో నటులు దర్శకులుగా మారడం ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో నడుస్తున్న ఆనవాయితీ అది. కాకపోతే అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా హీరోలు.. దర్శకులుగా మారి సత్తా చూపించారు. అయితే కమెడియన్లు దర్శకులుగా మారి హిట్లు కొట్టిన సందర్భం మాత్రం చాలా తక్కువ. ఆ మధ్య వెన్నెల కిషోర్ మెగా ఫోన్ పట్టిన కూడా ఫలితం మాత్రం శూన్యం. చేసిన మూడు సినిమాలు కూడా దారుణంగా బెడిసి కొట్టాయి. అయితే అదే సమయంలో మరో నటుడు అవసరాల శ్రీనివాస్ మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఎప్పుడు ఇదే బాటలో మరో కమెడియన్ కూడా మెగా ఫోన్ పడుతున్నాడు.
జబర్దస్త్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వేణు.. దాని కంటే ముందు కొన్ని సినిమాలు చూసి కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమాలో టిల్లు పాత్రకు ప్రాణం పోశాడు వేణు (Jabardasth Venu). ఆ సినిమాతో బిజీ కమెడియన్ అయిన వేణు.. జబర్దస్త్ కారణంగా కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ మధ్య వేరే వేరే చానల్స్ లో వచ్చిన కామెడీ ప్రోగ్రామ్స్ లో దర్శనం ఇచ్చిన వేణు.. అంతలోనే ఇప్పుడు దర్శకుడిగా మారాడు. అది కూడా ఏకంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో అవకాశం పట్టేసాడు.
ఈయన దర్శకుడిగా వస్తున్న మొదటి సినిమా బలగం (Balagam Movie) మార్చి 3న విడుదల కానుంది. ప్రియదర్శి ఇందులో హీరోగా నటించగా.. తూనీగ తూనీగా అంటూ చిన్నప్పుడు అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఊళ్లో ఉన్న 200 మంది జనాన్ని బలగం సినిమాలో నటించేలా చేశారు.
ఇందులో నాచురల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది. కచ్చితంగా ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు వేణు. మరి ఈ కమెడియన్ దర్శకుడుగా సక్సెస్ అవుతాడా లేదా అనేది మరో వారం రోజుల్లో తెలుస్తుంది. పైగా దిల్ రాజు (Dil Raj) నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో బలగంకు థియేటర్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి. ఈ వారం సినిమాలు కూడా లేకపోవడంతో విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు బలగం మంచి ఆప్షన్ గా మారింది.