Kangana slams Sharmila Tagore | వందేమాతరం అంశంపై బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా టాగూర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ‘వందేమాతరం’ గేయాన్ని కేవలం మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలనే షర్మిలా టాగూర్ సూచనను ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం మైండ్సెట్ నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలని కంగనా హితవు పలికారు. కళను, సాహిత్యాన్ని మతపరమైన కోణంలో మాత్రమే చూడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
షర్మిలా టాగూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలోని వివిధ మతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఇంతకుముందు కొనసాగించినట్లే వందేమాతరం గేయంలో కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా ఉంచాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పూర్తి గేయాన్ని అందరూ ఆమోదించడం కాస్త కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఒక్కడే దేవుడి(ఏకేశ్వరోపాసన)ని గట్టిగా నమ్మే మతస్తులు కోట్లాది మంది ఉన్నారని షర్మిలా టాగూర్ గుర్తుచేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. షర్మిలాజీ అభిప్రాయాన్ని చెప్పడాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఒక కళాకారిణిగా ఆమె ఆలోచనలు ఇంత సంకుచితంగా ఉండటం నాకు షాక్కు గురిచేసింది. కవితల్లో లేదా పాటల్లో వచ్చే పదాలు కేవలం రూపకాలు (metaphors). ఒక కవి లేదా కళాకారుడు ఊహాజనిత పదాలను, సాటిలేని పోలికలను అద్భుత ప్రభావం కోసం ఉపయోగిస్తాడు” అని పేర్కొన్నారు.
‘వందేమాతరం’ అనేది భారతదేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి అని, బంకించంద్ర చట్టోపాధ్యాయ దేశంలో శక్తిని మేల్కొలపడానికి ప్రయత్నించారని కంగనా తెలిపారు. స్వామి వివేకానంద కూడా ఉరుములు, మెరుపుల గురించి మాట్లాడినప్పుడు వాతావరణ అంచనా వేయలేదని, యువతలో శక్తిని జాగృతం చేయడమే ఆయన ఉద్దేశమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఏకేశ్వర ఉపాసనను నమ్మేవారు కూడా ‘శక్తి’ని ఒక శక్తిగా భావించవచ్చని, మతపరమైన ఆలోచనల నుంచి బయటపడి అందరం కలిసికట్టుగా ఉండాలని కంగనా పిలుపునిచ్చారు.