న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తులం (10 గ్రాములు) 24 క్యారట్ బంగారం ధర రూ.169 తగ్గి రూ.46,796కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,965 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఢిల్లీలో స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.67,611కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,911 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,804 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.01 అమెరికన్ డాలర్లు పలికింది.