SS Rajamouli | దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఏఐ (AI) వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. సూపర్స్టార్ మహేశ్బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వివాదాస్పద పోస్ట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఇందులో మహేశ్బాబు, రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు చూపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ వర్మ “సినిమా ఈజ్ డెడ్” (Cinema is Dead) అనే క్యాప్షన్ ఇచ్చాడు. భవిష్యత్తులో నటులు, దర్శకులు ఫిజికల్గా అవసరం లేదని, ఏఐ సాంకేతికతతోనే ఏదైనా సృష్టించవచ్చనే అనే ఉద్దేశ్యం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, రాజమౌళి మహేశ్బాబుతో సినిమా చేస్తున్న తరుణంలో.. వారిద్దరినీ ఇలా గొడవపడుతున్నట్లు చూపించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.