చోటా కె.నాయుడు.. టాలీవుడ్ నంబర్వన్ సినిమాటోగ్రాఫర్. కొత్త దర్శకులకు కొంగుబంగారం. కెమెరాతో కథ చెప్పడంలో దిట్ట. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన సినిమా ‘పెదకాపు-1’ విరాట్కర్ణను హీరోగా పరిచయం చేస్తూ మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29 విడుదల కానుంది. ఈ సందర్భంగా చోటా కె.నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలివి…
ఈ తరహా సినిమా నాకు కొత్త. అందుకే తొలి సినిమాగా భావించి పనిచేశాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలోని వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని శ్రీకాంత్ తయారుచేసుకున్న కథ ఇది. ఆనాటి వాతావరణం తీసుకురావటానికి చాలా కష్టపడ్డాం. కరెంట్ పోల్స్ నుంచి తొడుక్కునే బట్టల వరకూ ప్రతి విషయాన్నీ సునిశితంగా పరిశీలించి, ఎక్కడా పొరపాటు జరక్కుండా ఆనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఆవిష్కరించగలిగాం.
శ్రీకాంత్ కెరీర్లో ‘నారప్ప’ తప్ప తక్కిన సినిమాలన్నీ నేనే చేశాను. గత చిత్రాలకు ఇది భిన్నం. కథ విన్నాక ఇమిడియట్గా ‘నారప్ప’ చూశాను. తను హ్యాండిల్ చేయగలడని నమ్మకం ఏర్పడింది. ఫస్ట్నుంచి తన ప్రతి కథా నాకు చెప్పేవాడు శ్రీకాంత్. నాకు అనిపించిన సజెషన్స్ ఇచ్చేవాడ్ని. ఈ సినిమా విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. అతను పూర్తి క్లారిటీగా ఉన్నాడు. అందుకే అతనికేం కావాలో అదిచ్చాను. హీరోలను చూపించడమంటే నాకిష్టం. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విరాట్కర్ణ నాకు తొలిసినిమా హీరోగా అనిపించలేదు. అంతబాగా చేశాడు. అతనితోపాటు ఇందులో నటించిన ప్రతి నటుడూ బాగా చేశాడు. ముఖ్యంగా మా శ్రీకాంత్ అడ్డాల. ఇందులో తొలిసారి నటించాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అద్భుతంగా చేశాడు.
సినిమాటోగ్రఫీ పరంగా ఈ మధ్య నాకు బాగా నచ్చిన సినిమా ‘గంగూభాయ్’. నిజంగా సుదీప్ ఛటర్జీ కెమెరా అద్భుతం. కథల్ని బట్టే భావోద్వేగాలుంటాయి. కెమెరా ద్వారా భావోద్వేగాలను ఒడిసిపట్టగల సినిమాటోగ్రఫీ వందేళ్లు బతికుంటుంది. ఈ రోజుల్లో సినిమాను సెల్ఫోన్లతో కూడా తీసేయొచ్చు. అయితే కెమెరాతో కథ చెప్పడం తెలిసుండాలి. అది రానివాడు రెండో సినిమాకు కనిపించడు. నాకు కెమెరా ద్వారా కథ చెప్పడం తెలుసు. కానీ పెన్ను పట్టి కథ రాయడం తెలీదు. అందుకే నాలాంటివాడికి డైరెక్షన్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. పి.సి.శ్రీరామ్, బాలుమహేంద్ర, సంతోశ్ శివన్ నాకు గురుతుల్యులు. వారి స్థాయి నాకు లేదు. ఒకవేళ నేనంటూ చేస్త్తే ‘జవాన్’ని మించేలా ఉండాలనుకుంటా. అది సాధ్యమా?