Maheshbabu-rajamouli project | టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఘనత ఈయనది. రాజమౌళి సినిమా వస్తుందంటే నాలుగు వారాలు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవాలని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్లు వెల్లడించారంటే ఈయన క్రేజ్ ఏంటో తెలుస్తుంది . ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అనంతరం రాజమౌళి, మహేష్బాబుతో సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ మొదలుపెట్టాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో మహేష్బాబుతో పాటు మరో స్టార్ నటించనున్నాడట.
‘మహాన్’ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన చియాన్ విక్రమ్, రాజమౌళి-మహేష్బాబు చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో కథను మలుపు తిప్పే పాత్ర కోసం రాజమౌళి, హీరో విక్రమ్ను సంప్రదించారట. దీనికి విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఇప్పటికే రాజమౌళి- మహేష్బాబు కాంబోపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు విక్రమ్ ఈ చిత్రంలో నటించనున్నాడనే వార్త సినిమాపై మరింత అంచనాలను పెంచుతుంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మహేష్బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. మే 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రం అనంతరం మహేష్బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.