‘ఉప్పెన’ ‘కొండపొలం’ వంటి విభిన్న కథా చిత్రాల ద్వారా నటుడిగా సత్తా చాటారు వైష్ణవ్తేజ్. కెరీర్ ఆరంభంలోనే పాత్రలపరంగా కొత్తదనానికి పెద్దపీట వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం వైష్ణవ్తేజ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఓ ప్రేమజంట మధ్య తలెత్తే ఈగో సమస్యల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ సినిమాలో నేను మెడికల్ స్టూడెంట్గా కనిపిస్తా. కథలోని ఎమోషన్స్తో ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈగో క్లాష్ అనగానే మనందరికి ‘ఖుషి’ సినిమా గుర్తుకొస్తుంది. కానీ ఆ సినిమాతో ఎ లాంటి పోలికలు ఉండవు. ఇదొక పూర్తి భిన్నమైన ప్రేమకథ.
ఓ ప్రేక్షకుడి స్థానంలో ఊహించుకొని ఈ కథ విన్నా. బాగా నచ్చింది. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన హోల్సమ్ ఎంటర్టైనర్గా అనిపించింది. సినిమాలోని పాత్రలన్నీ మన నిజజీవితంలో తారసపడినట్లుగా అనిపిస్తాయి. మావయ్యను అనుకరించలేదు ఈ సినిమాలో ఓ సిగ్గుపడే సన్నివేశంలో నేను మావయ్య పవన్కల్యాణ్ను ఇమిటేట్ చేశానని అంటున్నారు. ఆ సీన్ తాలూకు వీడియో వైరల్ అయింది. మావయ్యను ఇమిటేట్ చేసేంత స్థాయి, ప్రతిభ నాకు లేవు. అయితే అచ్చం మావయ్య మేనరిజాన్ని ఇమిటేట్ చేశానని అభిమానులు అనడం ఆనందంగా ఉంది. అభినయాన్ని ప్రదర్శించే విషయంలో నా కళ్లే నాకున్న పెద్ద బలం అనుకుంటున్నా. నా కళ్లు చక్కటి భావాల్ని పలికిస్తాయని చాలా మంది చెబుతుంటారు. వారి మాటలు ఉత్సాహాన్నిస్తాయి. జయాపజయాల లెక్కలు వేసుకొని నేను కథల్ని ఎంచుకోను. నా మనసుకు నచ్చితే చాలు సినిమా అంగీకరిస్తా. వ్యక్తిగతంగా నేను విశాలదృక్పథంతో ఆలోచిస్తాను. నేరుగా నా హృదయం నుంచే మాట్లాడతాను. ప్రతిరోజు నా చుట్టూ ఓ పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటాను.
నేను సోషల్మీడియాకు చాలా దూరంగా ఉంటా. నా సినిమాల విషయంలో ఫ్రెండ్స్ మంచి సలహాలిస్తుంటారు. అమ్మ కూడా సినిమాల్ని బాగా విశ్లేషిస్తుంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేస్తున్నా. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఎన్.శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు.