Ram Charan Movie Career | మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రామ్చరణ్. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారి పలు సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు. ఇక గతేడాది రిలీజైన ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దిగ్గజ హాలీవుడ్ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్లోని చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఇక చిరు నుంచి నటననే కాదు డ్యాన్స్లను కూడా తెచ్చుకున్నాడు. ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో చరణ్ ఒకడు. ఇక లుక్స్ పరంగానూ ఒకప్పుడు తీవ్ర విమర్శలు అందుకున్న చరణ్ ఇప్పుడు ఐకాన్ ఆఫ్ ది స్టైల్గా మారిపోయాడు. ఇక సోమవారం చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ను తెలుపుతున్నారు.
రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇదే స్కూల్లో రానా దగ్గుబాటి, శర్వానంద్ మంచి స్నేహితులయ్యారు. చరణ్ మొదట క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడట. దానికోసం శిక్షణ కూడా తీసుకున్నాడు. పరేడ్ గ్రౌండ్లో జూనియర్ రంజీలో కూడా ఆడాడు. ఆ తర్వాత కొంత కాలానికి జర్మనీలో ఆటోమోబైల్ ఇంజనీర్ చేయాలని చిరంజీవితో చెప్పాడట. అయితే చిరంజీవి, చరణ్ను హీరోగా చేయాలనుకున్నాడు. కానీ చరణ్ ఇష్టాన్ని కాదనలేక ఆ కోర్స్ చేయడానికి ఒప్పుకున్నాడట. ఇక చిరంజీవి స్టార్ అవడంతో అప్పట్లో నిర్మాతలు, దర్శకులు తరచూ వాళ్ళ ఇంటికి వచ్చి చరణ్ను కూడా కలిసేవారట. ఎప్పుడు హీరోగా సినిమా చేస్తున్నావు. ఎలాంటి కథతో సినిమా చేయాలనుకుంటున్నావు అంటూ చరణ్కు సినిమాలపై ఇష్టాన్ని పెంచారట. అలా సినిమాలపై మక్కువ పెంచుకున్న చరణ్.. చిరంజీవి దగ్గరకు వెళ్ళి సినిమాల్లో నటిస్తాను అని చెప్పాడట. దాంతో యాక్టింగ్ నేర్చుకోమని చిరు.. చరణ్ను చెన్నై పంపాడట.
చరణ్ను ఎలాగైనా స్టార్ చేయాలని చిరు.. అల్లుఅరవింద్తో చర్చలు జరిపాడట. ఒక స్టార్ డైరెక్టర్ చేతిలో చరణ్ను పెడితే సెట్ అయిపోతుందని భావించాడట. దాంతో అప్పటికే స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళిని అల్లుఅరవింద్ సంప్రదించాడు. అయితే రాజమౌళి అప్పుడు.. చరణ్ నటనపై నాకు అవగాహన లేదు, మొదటి సినిమాను ఒక మంచి దర్శకుడితో తెరకెక్కించండి. రెండవ సినిమా ఖచ్చితంగా నేనే చేస్తాను అని చెప్పాడట. దాంతో చిరంజీవి, తన కుటుంబానికి సన్నిహితుడైన పూరీని పిలిపించాడట. ఇక పూరీ రెండు మూడు కథలను వినిపించగా చివరికి చిరుత స్టోరి ఓకే అయ్యింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘చిరుత’ 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.4కోట్ల షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. సౌత్లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్ల కిందట వచ్చిన ‘ఉప్పెన’ సినిమా వరకు ఆ రికార్డు చరణ్ పేరిటే ఉంది. ఇక ఫైనల్గా ఈ చిత్రం 25కోట్ల కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో చరణ్ లుక్స్పై విమర్శలు కూడా బాగానే వచ్చాయి. చరణ్కు నటన రాదని, హీరో ఫేస్ కాదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్, చిరంజీవి మేనియాతోనే హిట్టయిందని పలువురు అభిప్రాయపడ్డారు.
‘చిరుత’ తర్వాత రాజమౌళి చెప్పినట్టుగానే మగధీర కథను సిద్దం చేశాడు. అల్లుఅరవింద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ‘మగధీర’ 2009లో విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ చిత్రంతో 75కోట్ల మార్కు అందుకున్న మొదటి హీరోగా చరణ్ రికార్డు సృష్టించాడు. 35కోట్లతో నిర్మిత మైన ఈచిత్రం 75కోట్లకు పైగా షేర్ను సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘ఆరెంజ్’ డిజాస్టర్గా నిలిచింది. రామ్చరణ్ ఈ చిత్రంలో తన ఇమేజ్కు భిన్నంగా లవర్బాయ్ పాత్రలో నటించాడు. కమర్షియల్గా ఈ చిత్రం ఫ్లాప్ అయినా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన ‘రచ్చ’, ‘నాయక్’ చిత్రాలు కమర్షియల్గా మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలో చరణ్ డెబ్యూగా ‘జాంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ఘొర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ను తీవ్రంగా విమర్శించారు. బిగ్ బీ నటించిన జాంజీర్ పేరును చెడగొట్టాడని, చరణ్ది వుడెన్ ఫేస్ అని విమర్శించారు. ఆ చిత్రం తర్వాత ‘ఎవడు’ సినిమాతో తిరిగి కంబ్యాక్ చేశాడు. ఎవడు సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్లుగా నిలిచాయి.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ చరణ్ మార్కెట్ను అమాంతం పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటించాడు. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చరణ్ నటనకు విమర్శకుల సైతం జైజైలు కొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 122కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డును సాధించింది. చరణ్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించాడు. ఈ చిత్రం సక్సెస్ జోష్లో బోయపాటి శ్రీనుతో ‘వినయ విధేయ రామ’ సినిమాను చేశాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇక గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో చరణ్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ సినిమా మొదటి రోజే బాహుబలి రికార్డులను చెరిపివేసింది. ఈ సినిమాలో చరణ్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ట్రిపుల్ ఆర్ విడుదలైన నెలన్నరకు ఆచార్యతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తొలిసారి తండ్రి, కొడుకులు కలిసి సినిమా చేయడంతో రిలీజ్కు ముందు ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ఫ్లాప్ అంటూ ఎరగని కొరటాల ఈ సినిమాను తెరకెక్కించడంతో మెగా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. తీరా రిలీజయ్యాకా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండో ఆట నుంచి డల్ కలెక్షన్లు రావడం మొదలుపెట్టాయి. ఇక వారంలోపే చాలా వరకు థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా ఫలితం కొరటాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఇక ప్రస్తుతం చరణ్ రెండు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టాడు. అందులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమాకు ‘గేమ్ఛేంజర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినమాలో చరణ్కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది. ఇక దీనితో పాటుగా చరణ్ తన 16వ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ఉప్పెన ఫేం బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
చరణ్ నటుడుగానే కాకుండా నిర్మాతగానూ మారి చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా ‘ఖైదీ నం.150’ ను రూపొందించాడు. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయం అందుకున్నాడు. చిరంజీవి ఎప్పటినుంచే కలలు కనే మైథలాజికల్ కాన్సెప్ట్తో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ను నిర్మించినందుకు సంతోషంగా ఉన్నట్లు ఓ ఇంటర్వూలో తెలిపాడు.