అగ్ర హీరోలు ఇతరుల చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించి ప్రోత్సహించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు చిత్రాలకు నేపథ్య గళాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. తాజాగా ఆయన మరోసారి వాయిస్ ఓవర్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తన గళంలో కవితా పంక్తుల్ని వినిపించబోతున్నారు చిరంజీవి. వివరాల్లోకి వెళితే… కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ మార్తాండ’. ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఓ నటుడి జీవితానికి దృశ్యరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ఉపోద్ఘాత సన్నివేశాల్లో భావయుక్తమైన ఓ కవిత ద్వారా కథాంశం తాలూకు ఆత్మను ఆవిష్కరించబోతున్నారట. దీనికి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించబోతున్నారు. గతంలో కొన్ని చిత్రాలకు నేపథ్య గళాన్ని అందించినప్పటికీ…చక్కటి కవిత ద్వారా భావాల్ని వ్యక్తం చేయడం కొత్తగా అనిపించడంతో వాయిస్ ఓవర్కు చిరంజీవి వెంటనే ఓకే చెప్పారని తెలిసింది. నటన చుట్టూ అల్లుకున్న కథాంశం కావడంతో చిరంజీవి స్థాయి నటుడి ద్వారా ఆ కవితను చెప్పిస్తే ప్రేక్షకులకు బాగా చేరువవుతుందని దర్శకుడు కృష్ణవంశీ భావించారని అంటున్నారు. ‘రంగమార్త్తాండ’చిత్రంలో చిరంజీవి చెప్పే కవితా పంక్తులు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.