“పెద్ది’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది అరుదైన సినిమా. చూసినంతసేపూ భావోద్వేగానికి లోనయ్యాను. ఆ పాత్రలు అనుభవించిన బాధని నేనూ అనుభవించాను. ఇది మట్టి కథ, మట్టి మనిషి కథ. ఆ జీవన విధానాలపై అవగాహన ఉన్నవాడు కాబట్టే బుచ్చిబాబు ఈ కథను అంతబాగా రక్తికట్టించగలిగాడు. పాత్రగా మారిపోయి అన్ని భావోద్వేగాలను తెరపై పలికించడం సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో రామ్చరణ్ని చూసి తండ్రిగా గర్విస్తున్నా. తెరపై చరణ్ కనిపించలేదు. పెద్ది మాత్రమే కనిపించాడు. ఒక సంకల్పంతో, కఠోర శ్రమతో ముందుకెళ్లాడు కనుకే, తనకీ విజయం. తనలో పరిపూర్ణమైన నటుడ్ని చూశాను. అంతా నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు. వస్తే ఆనందం. రాకపోయినా పర్లేదు. ప్రజల మెప్పుకు మించిన అవార్డు లేదు. ‘గూండా’ సినిమా టైమ్లో నా కష్టాన్ని చూసి మా నాన్న అనుభవించిన సంఘర్షణను ‘పెద్ది’ టైమ్లో నేనూ అనుభవించాను.
‘పెద్ది’గా చరణ్ నటన చూసి పుత్రోత్సాహం పొందుతున్నాను’ అని అతిథిగా విచ్చేసిన అగ్ర హీరో చిరంజీవి ఆనందం వెలిబుచ్చారు. రామ్చరణ్ హీరోగా రూపొందిన పానిండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా బ్లాక్బస్టర్ మీట్లో చిరంజీవి మాట్లాడారు.
రామ్చరణ్ మాట్లాడుతూ ‘నాకెంతో సంతృప్తినిచ్చిన విజయం ఇది. ఇంతటి గొప్ప అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. రామ్చరణ్ని మర్చిపోయి అంతా ‘పెద్ది’నే గుర్తు పెట్టుకుంటారేమో అని భయమేస్తుంది. చివరికి మా అమ్మాయి క్లింకార కూడా నన్ను ‘పెద్ది’ అనే పిలుస్తున్నది. ఇంతటి అపూర్వమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకి, మా టీమ్ మొత్తానికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఇంకా అగ్ర దర్శకులు, సుకుమార్, అనిల్ రావిపూడితో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.