Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించినట్లు అధికారికంగా వెల్లడైంది. జనవరి 31 శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు తెలియజేశాయి. ఈ శుభవార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం విశేషం.చిరంజీవి తన పోస్ట్లో తల్లి, ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ, కుటుంబంలోకి ఈ ఇద్దరు చిన్నారులు రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని భావోద్వేగంగా తెలిపారు.
రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల కవలలకు జన్మనిచ్చారు. వారికి ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్ల పుట్టారని ఎంతో ఆనందంతో తెలియజేస్తున్నాం. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. తాతయ్య, నానమ్మగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరి ఆశీస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరంజీవి, సురేఖ పేర్లతో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన వెలువడగానే సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి మొదలైంది. చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు 2023లో జన్మించిన కుమార్తె క్లింకార ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కవల పిల్లలు పుట్టడంతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది. ముఖ్యంగా వారసుడు పుట్టినందుకు చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి సరదాగా మాట్లాడుతూ “ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు, నేను లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నాను. ఒక వారసుడిని కనివ్వమని చరణ్ని అడుగుతుంటాను” అని చెప్పిన విషయం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ మాటలు నిజమయ్యాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ – ఉపాసనలు ప్రేమించి 2012 జూన్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత 2023 జూన్ 20న క్లింకారకు జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడు కవల పిల్లల రాకతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగా ఇంట సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా కుటుంబ ఆనందంలో భాగస్వాములు అవుతున్నారు.