అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఈనెల 10న మరోసారి భేటీ కానున్నారు. ఆయనతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరవై రోజుల క్రితం సీఎం జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్తో జరిగిన చర్చలు ఫ్రూట్పుల్గా సాగాయని మరో 10రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చినట్లు చిరంజీవి మీడియాకు వెల్లడించారు.
అయితే దాదాపు ఇరవై రోజులు దాటిపోవస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ దశలో ఈరోజు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ జగన్, చిరంజీవిల మధ్య జరిగిన చర్చలు వ్యక్తిగతమైనవని పేర్కొనడంతో స్పందించిన చిరంజీవి సినీ పెద్దలతో కలిసి ఈనెల10న సీఎంతో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది .