ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. రోజురోజుకూ అసోసియేషన్లో గొడవలు పెరుగుతుండటం, ‘మా’ ఎన్నికలు (MAA Elections ) లేట్ అవుతుండటంతో.. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘మా’ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు ఆయన లేఖ రాశారు. ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్చి నెలలో నిర్వహించే ‘మా’ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఈసారి కరోనా వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఆపద్ధర్మ కార్యవర్గం కొనసాగుతున్నది. ఎన్నికలు నిర్వహించకుండా.. ఇలా ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు. కాబట్టి.. వీలైనంత త్వరగా మనం కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే జాప్యం లేకుండా ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి.. అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.
తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా ఉన్న మీరు, డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా మీ మార్గదర్శకత్వంలో ‘మా’ ఎన్నికలు సజావుగా, వీలైనంత త్వరగా జరుగుతాయన్న నమ్మకం నాకుంది. ఇటీవలే బార్ కౌన్సిల్ ఎన్నికలు, ఇంకా మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు కరోనా ప్రోటోకాల్ను పాటిస్తూ నిర్వహించారని తెలిసింది. అందుకే… వీలైనంత త్వరగా ‘మా’ ఎన్నికలను కూడా జరిపించండి.. అంటూ చిరంజీవి.. కృష్ణంరాజుకు లేఖ రాశారు.