‘ఈ జన్మ పగ కోసం.. వచ్చే జన్మ నీకోసం’ అనే డైలాగ్తో చిరంజీవి ‘ఖైదీ’ సినిమా ముగుస్తుంది. ఈ డైలాగ్ని పట్టుకొని, అక్కడ్నుంచి ఓ కొత్త కథ తయారు చేసేయొచ్చు. ‘ఖైదీ’కి సీక్వెల్ అన్నమాట. ఎవరు చేస్తారనుకుంటున్నారా? చిరంజీవే చేస్తారు. కథ బాగుండి..సరైన దర్శకుడు దొరికితే మెగాస్టార్ మాత్రం ఎందుకు వెనకాడతారు? ఈ ప్రాజెక్ట్ నిజమైతే బావుండు అనిపిస్తున్నది కదా. వాతావరణం చూస్తుంటే అలానే ఉంది. అవును.. ఇటీవలే ఈ విషయంపై చిరు, త్రివిక్రమ్ కలిశారట. ‘ఖైదీ’ సీక్వెల్ బాధ్యతను త్రివిక్రమ్కు అప్పజెప్పారట మెగాస్టార్.
ఫిలింవర్గాల్లో ఈ వార్త బాగానే వైరల్ అవుతున్నది. 1983లో విడుదలైన ‘ఖైదీ’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో అయ్యారు. ఇప్పుడు ఆయన ‘ఖైదీ’ సీక్వెల్ చేస్తే అది నిజంగా అభిమానులకు గొప్ప వార్తే. పైగా దర్శకుడు త్రివిక్రమ్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ప్రస్తుతం ఆయన మహేశ్తో ‘గుంటూరుకారం’ చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ సినిమా ఉండొచ్చని టాక్. చిరంజీవి కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ ‘ఖైదీ’ సీక్వెల్ విషయంలో నిజం ఎంతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.