‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అందించిన విజయంతో మంచి జోష్లో వున్నారు సీనియర్ కథానాయకుడు చిరంజీవి. పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ చిత్రం సక్సెస్తో వరుసగా చిత్రాలు చేయాలనే ఉత్సాహంతో కొత్త కథలు వింటున్నారు చిరంజీవి. ప్రస్తుతం మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్న చిరు తదుపరి చిత్రాల కథలను కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇటీవల ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వశిష్ట చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంతో పాటు ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్లో నిర్మించనుంది. ఈ యువ దర్శకుల కాంబినేషన్లో చిరంజీవి నటించనున్న ఈ చిత్రాల మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.