పర్సంటేజీ విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకోవాలని, జూన్ 4న విడుదల కాబోతున్న ‘పెద్ది’ చిత్రానికి పర్సంటేజీని ఇవ్వాలని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల నిర్మాతల గిల్డ్ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీని కూడా నియమించింది. రెండు నెలల్లోనే నివేదిక అందించేలా కమిటీకి కాలపరిమితిని విధించారు. ఇండస్ట్రీలో నెలకొన్న ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో సోమవారం అగ్ర కథానాయకుడు చిరంజీవిని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, కె.ఎల్.నారాయణ, అల్లు అరవింద్ తదితరులు కలిసి చర్చలు జరిపారు. దాదాపు గంటకుపైగా సాగిన ఈ చర్చల్లో పర్సంటేజీ విధానంతో పాటు ఇండస్ట్రీలోని పలు సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఇది ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో చర్చ కాదని, రాబోవు చిత్రాలకు ఇబ్బంది లేకుండా అందరికి అమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో వేసిన కమిటీలు, వాటి పనితీరు పట్ల డిస్ట్రిబ్యూటర్లలో కొంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ జూన్ 30వ తేదీలోగా పర్సంటేజీ విధానం మీద ఓ ప్రతిపాదన తీసుకొస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. దిల్రాజు మాట్లాడుతూ ‘ఎగ్జిబిటర్ల సమస్యల్ని చిరంజీవిగారు సానుకూలంగా విన్నారు. ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలను తెప్పించుకొని పరిశీలిస్తానని చెప్పారు. రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ వివరాలను ఛాంబర్ అధికారికంగా ప్రకటిస్తుంది’ అని దిల్రాజు అన్నారు.