ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే. కానీ ఇవాళ తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వంగా ఉందన్నారు హీరో చిరంజీవి. రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన ’ఆచార్య’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ…’ఇన్నాళ్లకు తెలుగు సినిమాకు జాతీయస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది. అందులో రాజమౌళి లాంటి దర్శకుల కృషి ఎంతో ఉంది. ఇవాళ తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. మన హీరోలంతా పాన్ ఇండియా తారలే. కొరటాల శివ సినిమాలు హుందాగా ఉంటాయి. ఆయన తరహా చిత్రంలో మా స్టార్ డమ్కు తగిన మాస్ అంశాలు చేరితే ఎలా ఉంటుందో ఆచార్యలో చూస్తారు. పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రమిది. చరణ్ నా కాంబినేషన్ సన్నివేశాలు హృద్యంగా ఉండి ఆకట్టుకుంటాయి. ఏప్రిల్ 29న ఈ సినిమాను మనమంతా ఆస్వాదిద్దాం.’ అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ..’ నా జీవితంలో నిజమైన ఆచార్య నాన్నే. ఈ సినిమాలో నాన్నగారితో పనిచేయడాన్ని ఆస్వాదించాను. 20 ఏళ్లలో నాన్నను చూసి నేర్చుకున్న దానికంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన్ను దగ్గర నుంచి తెలుసుకున్నదే ఎక్కువ. ఆచార్య ఘన విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను.’ అన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ..’సాంకేతికంగా ఆచార్య నన్ను బాగా ఆకట్టుకుంది. ఒక అభిమానిగా చిరంజీవిగారు నాకు బాగుంటారు. కానీ ఒక దర్శకుడిగా చరణ్ ను ఇష్టపడతాను. కొరటాల శివలో ఒక పెద్ద మాస్ దర్శకుడు ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవిగారి సినిమాలు చూసేందుకు టికెట్ ల కోసం పోటీలు పడేవాళ్లం. ఇవాళ ఆయన సినిమాకు దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో చిరంజీవి రూపంలో మా అందరికీ ఒక ఆచార్యుడు దొరికాడు. ఆయనతో గడిపిన రోజులు మర్చిపోలేను. మెగా అభిమానులకు పండగ లాంటి చిత్రమిది. అని అన్నారు దర్శకుడు కొరటాల శివ.