ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ భీష్ముడుగా పేరు తెచ్చుకున్న కొణిజేటి రోశయ్య (88) శనివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నాం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించనున్నారు. రోశయ్యని కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు. తాజాగా చిరంజీవి రోశయ్య పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని అని అన్నారు.
రోశయ్య మృతి విషయం తెలియగానే చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యగారి మరణం తీరని విషాదం. ఆయన రాజకీయాల్లో భీష్మాచార్యుడు వంటివారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఆయన రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు చిరంజీవి.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో రోశయ్యను చిరంజీవి పలుమార్లు కలిశారు. అసంఘటిక కార్మిక సమస్యలు పరిష్కరించాలని అప్పట్లో సీఎం రోశయ్యను చిరంజీవి కోరిన విషయం మనందరికి తెలిసిందే.
.