Chiranjeevi | ‘ప్రతి కళాకారుడికీ సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగిస్తున్నాం అని ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్క కళాకారుడూ ఒక సామాజిక సేవకుడు అవుతాడు. నాలోని సేవకుడికి ఊపిరులూదింది ఆ ఆలోచనే. అక్కడి నుంచే బ్లడ్బ్యాంక్ పుట్టింది. ఇదంతా అభిమానుల చలవ’ అన్నారు పద్మవిభూషణ్ చిరంజీవి. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పద్మవిభూషణుడైన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలో సినీ ప్రముఖులందరూ కలిసి చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పీపుల్మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు కలిసి ఈ వేడుకను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, స్వప్నదత్, సుస్మిత కొణిదెల, ఆనంద్ దేవరకొండ, ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు. చల్లని సాయంత్రం జరిగిన ఈ సంబరంలో యువనటీనటులతోపాటు ‘హనుమాన్’ఫేం తేజా సజ్జా డాన్సులతో అలరించారు.