లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది గాయని చిన్మయి శ్రీపాద. తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు దక్షిణాదిన సంచలనం సృష్టించాయి. తమిళ ఇండస్ట్రీ ఆమెపై నిషేధం కూడా విధించింది. అయితే వైరముత్తు లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోసం చిన్మయి పోరాటం సాగిస్తూనే ఉంది. తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఓ లేఖ రాసింది. రాజకీయ పలుకుబడిని వైరముత్తు తనకు రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని, ఆయన్ని కోర్టు ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వ పరంగా తనకు సహకరించాలని చిన్మయి విజ్ఞప్తి చేసింది. ‘దేశంలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కడ వెలుగుచూసినా మీరు స్పందిస్తున్నారు. బాధితుల తరపున గళాన్ని వినిపిస్తున్నారు. మీలాంటి రాజకీయ నేతలు అండగా ఉంటే సామాన్య ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. మీ మిత్రుడు, పార్టీ మద్దతుదారుడైన వైరముత్తు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఎంతోమంది అమాయకులైన అమ్మాయిల గొంతు నొక్కుతున్నారు. ఇప్పటివరకు 17 మంది అమ్మాయిలు తాము వైరముత్తు నుంచి వేధింపులను ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను గత ఐదేళ్లుగా సొంత పరిశ్రమ నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటూ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఈ దేశంలో రాజకీయ పరపతి, పరిచయాలు లేకుంటే న్యాయం జరగడానికి ఇరవై ఏళ్లయినా పడుతుంది. మీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వైరముత్తును ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. ఆయన్ని కోర్టు ముందు దోషిగా నిలబెట్టడానికి మీ సహాయాన్ని అభ్యర్థిస్తున్నా’ అని చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ లేఖలో పేర్కొంది.