Chinmayi Sripada : సరోగసి వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ‘తాము కవలలకు తల్లిదండ్రులయ్యాం’ అంటూ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సరోసగి పదం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సరోసగి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ పేజిలో వీడియో, ఫొటోలను షేర్ చేశారు.
‘‘32 వారాల తర్వాత నా ఫొటోను మీతో ఇప్పుడే పంచుకుంటున్నాను. వీలైనన్ని ఫొటోలు తీసుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే, దీని వెనకున్న కారణాన్ని ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాను. మొదటిసారి గర్భస్రావమైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. డబ్బింగ్, రికార్డింగ్ సమయాల్లో నా ఫొటోలు, వీడియోలు తీయొద్దని చెప్పాను. నా వ్యక్తి గత జీవితానికి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేసేదాన్ని. అయితే సరోగసిపై వస్తున్న ప్రశ్నలకు ఇదే నా సమాధానం. సరోగసి, ఐవీఎఫ్, సహజ గర్భం ఇలా ఏ రూపంలో అయినా పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు. అమ్మ అంటే అమ్మ అంతే. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏమనుకున్నా.. అది వాళ్ల అభిప్రాయం. నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని తెలిపారు.
చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ ఈ ఏడాది జూన్లో కవలలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకునే చిన్మయి.. తల్లికాబోతున్న విషయాన్ని మాత్రం చెప్పకపోవడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ జంట సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులయ్యారంటూ కామెంట్లు చేశారు. వీటిపై తాజాగా చిన్మయి పైవిధంగా స్పందించారు. వీటితోపాటు తన బేబీ బంప్ ఫొటోను సైతం పోస్టుచేశారు. ఇక తన ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలుపడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.