రాజ్కుంద్రా చెప్పిన మాటలు నమ్మి తాను మోసపోయానని బాలీవుడ్ నటి షెర్లిన్చోప్రా పేర్కొంది. తనతో పాటు ఎంతో మంది అమ్మాయిల్ని రాజ్కుంద్రా తప్పుదోవ పట్టించారని చెప్పింది. పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి షెర్లిన్చోప్రాను శుక్రవారం ముంబయి క్రైమ్బ్రాంచ్ పోలీసులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఈ పోలీస్ విచారణ గురించి షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ ‘రాజ్కుంద్రాను నేను మొదటిసారి ముంబయిలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో కలిశాను. అప్పటి నుంచి మా మధ్య జరిగిన చర్చల తాలూకు వివరాల గురించి పోలీసులు ప్రశ్నలు అడిగారు. రాజ్కుంద్రాతో నేను చేసుకున్న అగ్రిమెంట్స్, ఇప్పటివరకు ఎన్ని వీడియోలలో నటించానో తెలుసుకున్నారు. షూటింగ్ టైమ్లో నాతో పాటు ఉన్న వారి వివరాల గురించి ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి రాజ్కుంద్రా నన్ను ఎలా మోసం చేశాడో మొత్తం పోలీసులకు వివరించా. అశ్లీల చిత్రాల కేసులో నేను విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాజ్కుంద్రాతో పరిచయం నా కెరీర్ను మార్చివేస్తుందని, నటిగా నన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని నమ్మాను. అతడి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అశ్లీల చిత్రాలు బోల్డ్ కంటెంట్లో భాగమేనంటూ నన్ను నమ్మించాడు. నాపై షూట్ చేసిన వీడియోలు, ఫొటోలు శిల్పాశెట్టికి నచ్చాయంటూ అబద్దాలు చెప్పాడు. తన మాయమాటలతో మోసం చేశాడు. డబ్బుల కోసం ఇతరుల జీవితాలతో ఆడుకునే స్వార్థ పరిశ్రమ ఇది’ అని తెలిపింది.