సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్నుమూసారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు.
విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్గా పని చేశారు. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సంతాపం తెలియజేసారు. పలు చిత్రాలకు తన డిజైన్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధను కలిగిస్తుందని బాలకృష్ణ అన్నారు. నేను కథానాయకుడిగా పని చేసిన కొన్ని చిత్రాలకు ఈశ్వర్ పని చేశారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టుగా బాలకృష్ణ తెలిపారు. దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.