వరుణ్సందేశ్, గగన్, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. ఏకే జంపన్న దర్శకుడు. కశికా కపూర్, దివి కథానాయికలు. గురువారం గ్లింప్స్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంతా బాగుండేది. కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారాయి.
కులం మనుషుల మధ్య అడ్డుగోడగా మారింది. కులం నిత్యజీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు. సెన్సిటివ్ పాయింట్తో ఈ సినిమా తీశారని వరుణ్సందేశ్ తెలిపారు. ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వర రావు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.