Actor Upendra | నటుడు, దర్శకుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఉపేంద్ర ఆదివారం ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ సెషన్ నిర్వహించాడు. అయితే ఆ లైవ్ సెషన్లో ఉపేంద్ర చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి. తనపై, తన రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తున్న కొందరిని ఉద్దేశించి.. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉంటారు. అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసే వాళ్లు కూడా ఉంటారు. వాళ్ల గురించి మనం పట్టించుకోవద్దు. వాళ్ల కామెంట్స్ను చదవద్దు. ప్రజలపై ప్రేమాభిమానాలు కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ఇలా విమర్శించే వాళ్లను దళితులతో పోల్చి ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి సంబంధించిన లైవ్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో కర్ణాటకలోని రామనగర ప్రాంతంలోని ప్రజా సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. నిరసనకారులు ఉపేంద్ర పోస్టర్లను తగలబెట్టారు. ఈ క్రమంలోనే ఉపేంద్ర వ్యాఖ్యలు తమను ఆవేదనకు గురిచేశాయంటూ చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. దీంతో ఉపేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ సెషన్లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల అనేక మంది మనసును గాయపరిచిందని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించడంటూ పోస్ట్ పెట్టాడు.