బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తాజా చిత్రం ‘కెప్టెన్ ఇండియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘చక్ దే ఇండియా’ ఫేమ్ షిమిత్ అమీన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో చిత్రీకరణ మొదలుకానుంది. యుద్ధ ప్రభావిత దేశం నుంచి ప్రయాణీకులను సురక్షితంగా వారి మాతృదేశానికి తరలించిన ఓ పైలెట్ యథార్థ గాథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మిడ్ ఎ యిర్ సర్వైవల్ డ్రామా ఇదని, సాహసం.. దేశభక్తి అంశాలు ప్రధానంగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. విశేషమేమిటంటే.. ఈ సినిమా కోసం హీరో కార్తీక్ ఆర్యన్ విమానం నడపటంలో శిక్షణ తీసుకుంటున్నాడట. ఇందుకోసం ఆయన ప్రత్యేక అనుమతులు కూడా తీసుకున్నాడని తెలిసింది. దర్శకుడి సూచన మేరకు పాత్రలో సహజత్వం కోసం కార్తీక్ ఆర్యన్ పైలెట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడని, ఇండియన్ మూవీలో సరికొత్త ప్రయోగమిదని చెబుతున్నారు. భారత్తో పాటు మొరాకోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగనుంది.