‘మా గురువు బాలచందర్తో కలిసి 2004లో ఒక డ్రామా చూశాను. ఆ డ్రామాను స్ఫూర్తిగా తీసుకుని 17 ఏళ్ల తరువాత ‘వినోదయ సిత్తం’ పేరుతో సినిమాగా తీశాను. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని అనుకుంటే సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది’ అన్నారు నటుడు, దర్శకుడు పి. సముద్ర ఖని. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. ‘వినోదయ సిత్తం’కు తెలుగు రీమేక్గా టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్కల్యాణ్, సాయిధరమ్తేజ్ కథానాయకులు.ఈ నెల 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సముద్రఖని విలేకర్లతో ముచ్చటించారు. చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నా జీవితంలో నేను ఏది ప్లాన్ చేయలేదు. దర్శకుడిగా ఇది నా 15వ సినిమా. ఈ 15 సినిమాలకు నేనేది ప్లాన్ చేయలేదు. 1994లో అసిస్టెంట్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నా పని నేను చూసుకుంటూ, జయపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. ఈ కథను పవన్కల్యాణ్కు వినిపించాక,మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. దర్శకుడిగా నేను ఎంతో క్లారిటీగా వున్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం సమయం వృథా చేయకూడదని సెట్లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్టతో పనిచేశారు. 53 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. కానీ విజువల్స్ చూస్తే 150 రోజులు షూట్ చేసిన సినిమాలా వుంటుంది. ఇప్పటి దాకా నేను చేసిన సినిమాల్లో ఇదే నాబెస్ట్ మూవీ
మాతృకలోని ఆత్మని తీసుకుని పవన్కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా వచ్చింది. త్రివిక్రమ్ సపోర్ట్తో ఈ సినిమా చేశాను. ఇక్కడ నేటివిటికి మీద ఆయనకున్న పట్టు చాలా గొప్పది. నేను ఈ సినిమా చేయడానికి కారణం త్రివిక్రమ్. ఈ కథను ఎక్కువ మందికి చేరువ కావాలని, అందుకే పవన్ కళ్యాణ్తో ఈ సినిమా తీస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. కాలమే త్రివిక్రమ్ను,కళ్యాణ్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఓ తండ్రిలా అండగా నిలబడ్డాడు. ఈ కథను అన్ని భాషలకు చేరువ చేయాలనే సంకల్పంతో 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ‘వినోదయ సిత్తం’కు చేయక ముందు, తరువాత ఏంటి అనేది స్పష్టత లేదు. ఈ సినిమా చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇప్పుడు ‘బ్రో’ చేశాక ఇంతకంటే సాధించడానికి ఏం లేదు. ఇప్పటి నుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది.