భాషాపరంగా తాను ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదని, నవ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ పాన్ఇండియా తారగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. కన్నడనాట ‘కిరిక్పార్టీ’ సినిమాతో ఆరంభమైన ఈ అమ్మడి సినీ ప్రస్థానం అనతికాలంలోనే జోరందుకుంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. ఈ క్రమంలో మాతృచిత్రసీమ కన్నడకు ఈ భామ దూరమైపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై రష్మిక మందన్న తనదైన శైలిలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేసినా కావాల్సినంత గుర్తింపు వస్తుంది. అదే కథానాయికలైతే నాలుగైదు సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్ల హీరోయిన్లు ఒకే భాషకు పరిమితమైపోవడం మంచిదికాదు. అదీగాక ప్రస్తుతం సినీ సమీకరణాలు మారిపోతున్నాయి. భాషాపరంగా కాకుండా కథల ఎంపికలో కొత్తదనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే ధోరణి పెరిగింది. నేనూ అదే పంథాను అనుసరిస్తున్నా. కథలో వైవిధ్యం ఉంటే ఏ భాషా చిత్రంలో నటించడానికైనా అభ్యంతరం లేదు. కథల ఎంపికలో భాషాపరమైన హద్దులు విధించుకోకుండా రూల్స్ బ్రేక్చేయాల్సిందే’ అని చెప్పింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.