‘మన సంస్కృతిలోని ఉన్న గొప్ప కథలి, పురాణ ఇతివృత్తాల్ని నాదైన శైలిలో ఆవిష్కరిస్తూ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రంలో మనదేశం యొక్క ఆత్మ, అధ్యాత్మికత కనిపిస్తాయి’ అని చెప్పారు అయాన్ ముఖర్జీ. ఆయన దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. రణ్బీర్కపూర్, అలియాభట్ జంటగా నటించారు. అమితాబ్బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్ని పోషించారు. సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్ర విశేషాల్ని తెలిపారు.
‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ వినగానే పీరియాడిక్ అనుకుంటున్నారు. కానీ సమకాలీన కథ ఇది. భారతీయ పురాణాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ సిద్ధం చేశా. ఓ రకంగా ఈ సినిమాను మోడరన్ మైథాలజీగా అభివర్ణించవొచ్చు. పాత్రలకు తగిన నటీనటులు కుదిరారు. నాగార్జునగారు తన క్యారెక్టర్కు ఫర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. మన పురాణాల్లో చాలా మంది సూపర్ హీరోలున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ మొదటిభాగంలో శివుడి కాన్సెప్ట్ను ఎంచుకున్నాం. శివుడు సృష్టించడంతో పాటు మూడో కన్ను తెరిచి దేనినైనా నాశనం చేయగలడు.
చరిత్ర ఆధారంగా..
హాలీవుడ్ చిత్రాలన్నీ పాఠకాదరణ పొందిన కామిక్ పుస్తకాల ఆధారంగా తెరకెక్కించినవే. అలా భారతీయ చరిత్ర ఆధారంగా సినిమాలు ఎందుకు తీయలేమన్న ఆలోచనతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టాం. 2011లో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నా. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.