విలక్షణ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పంచతంత్రం’ సినిమా కోసం పాత్రల్ని పరిచయం చేసే కథకుడిగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ ఆగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. ఈ సినిమాలో బ్రహ్మానందం ఫస్ట్లుక్ను శనివారం విడుదల చేశారు. ఇందులో ఆయన వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘నవ్విస్తూ, సెంటిమెంట్ను పండిస్తూ కన్నీళ్లు పెట్టించేలా బ్రహ్మానందం పాత్ర సాగుతుంది. సినిమా కథ, పాత్రలను వివరించే కథకుడిగా ఆయన కనిపిస్తారు’ అని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని, నవంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె నల్లి, సంగీతం: ప్రశాంత్ ఆర్, రచన, దర్శకత్వం: హర్ష పులిపాక.