Boyapati | టాలీవుడ్లో పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న వేళ, అగ్ర దర్శకులంతా దేశవ్యాప్తంగా మార్కెట్ సాధించే సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ రేసులో కొంతమంది దర్శకులు ఇంకా బలమైన హిట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ జాబితాలో యాక్షన్ చిత్రాల కేరాఫ్ అడ్రస్గా పేరుగాంచిన బోయపాటి శ్రీను ముందువరుసలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు హార్డ్కోర్ యాక్షన్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బోయపాటి, పూర్తి స్థాయి పాన్ ఇండియా సక్సెస్ను మాత్రం అందుకోలేకపోయారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ 2ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు స్పందన వచ్చినా, ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో బోయపాటి పాన్ ఇండియా డ్రీమ్ మరోసారి వాయిదా పడింది.
తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో పాన్ ఇండియా సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ‘ధురంధర్’ సినిమాతో వరల్డ్ వైడ్ హిట్ సాధించిన రణ్వీర్కు బోయపాటి కథ వినిపించారని ప్రచారం జరిగింది. అయితే బాలీవుడ్లో ప్రస్తుతం రణ్వీర్ బిజీ షెడ్యూల్లో ఉండటంతో, ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్లో పడినట్లు టాక్ వినిపిస్తోంది. రణ్వీర్కు పలువురు బాలీవుడ్ దర్శకులు వరుస ఆఫర్లు ఇస్తుండటంతో, బోయపాటి ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రానాకు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉండటంతో, తన స్క్రిప్ట్కు ఆయన సరైన ఎంపిక అవుతారని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. రణ్వీర్కు వినిపించిన కథనే కాస్త మార్చి , భారీ స్థాయిలో తెరకెక్కించాలని దర్శకుడు ఆలోచిస్తున్నారని టాక్. ఇంతవరకు చేయని స్కేల్లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలచాలని ప్లాన్ చేస్తున్నారట. బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన మాస్ అప్పీల్ ఉంది. అయితే పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని కథనం, ట్రీట్మెంట్లో మార్పులు అవసరమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రానాతో ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, ఇది బోయపాటికి కీలక పరీక్షగా మారనుంది.